ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ అయ్యాయి. అధికార పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. గత కొంతకాలంగా అధిష్టానం వైఖరిపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన ఇటీవలే ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా బుధవారం ఎమ్మెల్యే పార్టీపై, ప్రభుత్వంపై మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఆయన పార్టీని వీడనున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం దీనిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందిస్తూ.. కోటంరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీనుంచి బయటకు వెళ్లినా తమకెలాంటి నష్టం లేదన్నట్లు మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అవాస్తవమని అన్నారు. దీంతో కోటంరెడ్డి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, బుధవారం మీడియా సమావేశంలో వెల్లడిస్తానని తెలిపారు.
ఈ క్రమంలో ఆయన తన కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అభిమానంతోనే పార్టీలో చేరానని, తొలినుంచి పార్టీలో ఎంతో నిబద్దతతో పనిచేశానని తెలిపారు. కానీ తనకు వ్యతిరేకంగా పార్టీలోని నాయకులే వ్యవహరించడం బాధగా ఉందని, తాను చేసిన తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న ఎమ్మెల్యే.. అధికార పార్టీ నేతలపైనే నిఘా ఎందుకని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తాను కేవలం ఆరోపణలు చేయడం లేదని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలియజేశారు. అవి బయట పెడితే ఒకరిద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయని, ఈ విషయం ఎంతదూరం పోతుందో చెప్పలేనని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదంటే సీఎం జగన్కు కానీ తెలియకుండా తన ఫోన్ ట్యాపింగ్ జరగదని, ఎందుకంటే.. ఎమ్మెల్యేల ఫోన్లు, అందులోనూ అధికార పార్టీకి చెందిన నేతల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయంటే వారి ఆదేశాలు లేకుండా జరిగే పనికాదని వ్యాఖ్యానించారు. తనతోపాటు ఇంకా చాలామంది ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నట్లు భావిస్తున్నానని, సీఎం జగన్ ఆలోచన చేయాలని.. ఆయన ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది? అని కోటంరెడ్డి ప్రశ్నించారు.
ఇక నిన్న తనపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ అన్నట్లుగానే తాను భావిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదని స్పష్టం చేశారు. పార్టీలో తనను ఎవరెన్ని రకాలుగా విమర్శించినా, తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా కేవలం సీఎం జగన్పై అభిమానంతో పార్టీలో కొనసాగానని తెలిపారు. ఇంతచేసినా తనపై అపనమ్మకంతో ఉండటం భరించలేకపోతున్నానని, పడిన అవమానాలు చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై పార్టీలో కొనసాగాలని అనుకోవడంలేదని, అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయాలని కూడా తాను అనుకోవడం లేదని చెప్పారు. ఇక ఈ సందర్భంగా టీడీపీలో చేరనున్నారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బదులిస్తూ.. అది నిర్ణయించాల్సింది తాను కానని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు. దీంతో త్వరలోనే కోటంరెడ్డి టీడీపీలో చేరడం ఖాయమనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE