తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “మన ఊరు – మన బడి” కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే తొలిగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన ‘కేజీ టూ పీజీ’ క్యాంపస్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు బుధవారం గంభీరావుపేటలోని ‘కేజీ టూ పీజీ’ క్యాంపస్ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత పిల్లలకు మెరుగైన సదుపాయాలతో ఒకే చోట కేజీ టూ పీజీ ఉచిత విద్య అందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సాకారమయ్యిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్యాంపస్ ప్రారంభించిన అనంతరం మంత్రులు ఇరువురు క్యాంపస్లో కలియతిరుగుతూ తరగతి గదులను, విద్యార్థుల వసతులను పరిశీలించారు. కాగా మంత్రి కేటీఆర్ దీనిపై ప్రత్యేక చొరవ తీసుకుని యశోద హాస్పిటల్, మైండ్స్పేస్ రిట్, రహేజా కార్ప్ ఫౌండేషన్, ఎమ్మార్ఎఫ్, గ్రీన్ కో, దివీస్ ల్యాబ్స్ వంటి పలు దిగ్గజ కార్పొరేట్ సంస్థల సహకారంతో దాదాపు రూ. 3కోట్లు అంచనా వ్యయంతో గంభీరావుపేటలో 6 ఎకరాల స్థలంలో ఈ క్యాంపస్ను నిర్మించారు. ఇక సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మరో 22 పాఠశాలలను కూడా ప్రారంభించనున్నారు.
గంభీరావుపేటలోని ‘కేజీ టూ పీజీ’ క్యాంపస్ ప్రత్యేకతలు..
- ఈ క్యాంపస్లో మొత్తం 3500 మంది విద్యార్థులు చదువుకునే వీలుంది.
- తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం భాషలలో బోధన సాగనుంది.
- ఇక వీరి కోసం మొత్తం 70 తరగతి గదులు ఏర్పాటు చేశారు.
- 250 మంది పిల్లలకు సరిపడే అంగన్వాడీ కేంద్రం ఉంది.
- ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలకు వేర్వేరుగా భవనాలు ఉన్నాయి.
- భారీ క్రీడా మైదానంతో పాటు వెయ్యి మంది ఒకే సారి కూర్చొని తినేలా డైనింగ్ హాల్ నిర్మించారు.
- అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం వంటివి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE