ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పింఛను లబ్ధిదారులందరికీ ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 17, సోమవారం నుంచి పంపిణీ చేస్తుంది. ఫిబ్రవరి నెలలో పలు రకాల పింఛన్లకు సంబంధించి 54,68,322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీరందరికి ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు గ్రామ వాలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. ఫిబ్రవరి నెలలో కొత్తగా ఎంపిక చేసిన పింఛను లబ్ధిదారులకు పింఛను పుస్తకంతోపాటు గుర్తింపు కార్డు అందిస్తారు. పాత పింఛనుదారులకు ఇప్పటికే పింఛను పుస్తకాలు అందజేయడంతో వారికి కొత్తగా కేవలం గుర్తింపు కార్డులను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మరోవైపు పింఛన్లకు సంబంధించి అనర్హులుగా తేలిన వారిపై మరోకసారి రీ సర్వే నిర్వహిస్తున్నారు. రీ సర్వేలో మళ్ళీ ఎవరైనా అర్హులుగా తేలితే వారికి మార్చి 1వ తేదీ నుంచి పెన్షన్ గుర్తింపు కార్డులు అందజేయనున్నారు.
[subscribe]