భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా జనవరి 17, శుక్రవారం నాడు రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 36 పరుగుల తేడాతో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. భారత్ జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ 42, శిఖర్ ధావన్ 96 పరుగులతో రాణించారు. శిఖర్ ధావన్ ధాటిగా ఆడుతున్న క్రమంలో త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఇక కోహ్లీ వన్డేల్లో 56వ హాఫ్ సెంచరీ నమోదు చేసుకుని 78 వద్ద వెనుదిరిగాడు. అలాగే ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కోన్నాడు. నాలుగో వికెట్కు కోహ్లీతో కలిసి 78 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. 52 బంతుల్లోనే 80 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ చివర్లో రనౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 20 పరుగులతో తన వంతు సహకారం అందించడంతో భారత్ 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకు నిర్దేశించింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జాంపా మూడు వికెట్లు తీయగా, కానే రిచర్డ్ సన్ 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు 49.1 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్సమెన్లలో స్టీవ్ స్మిత్ 98 పరుగులుతో ఒంటరి పోరాటం చేశాడు. అలాగే లబుషేన్ 46, ఫించ్ 33, అగర్ 25 పరుగులు చేసి వెనుదిరిగారు. ఒక దశలో విజయంవైపు సాగుతున్న ఆస్ట్రేలియా జట్టును కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ కట్టడి చేసాడు. 38వ ఓవర్లో అలెక్స్ కారే, స్మిత్ వికెట్లను కుల్దీప్ చేజిక్కించుకోగా, 44 ఓవర్లో టర్నర్, పాట్ కమ్మిన్స్ వికెట్లను షమీ పడగొట్టడంతో మ్యాచ్ మలుపుతిరిగింది. దీంతో భారత్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలు తలా 2 వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు. ఇక మూడో వన్డే జనవరి 19, ఆదివారం నాడు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.