ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 (కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మార్చ్ 20, శుక్రవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 223 కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 18 కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మార్చ్ 22 ఆదివారం నాడు నిర్వహించే జనతా కర్ఫ్యూ లో ప్రజలందరూ పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.
“కరోనాపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన సూచనలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. మోదీ చేసిన సూచనలను జన సైనికులే కాక తెలుగు ప్రజలందరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 22వ తేదీ ఆదివారాన్ని ప్రధాని చెప్పినట్టు జనతా కర్ఫ్యూగా పాటిద్దాం. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితమవుదాం. కరోనా మహమ్మారిని నిర్మూలించడం ప్రమాదకరమని తెలిసినా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రతి ఒక్కరికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాన మోదీ చెప్పినట్లు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మన ఇంటి బాల్కనీలో నిలబడి కరతాళ ధ్వనుల ద్వారా వారికి సంఘీభావం తెలుపుదామని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
“ఈ సందర్భంగా అమెరికాలో చూసిన నా అనుభవాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ ను టెర్రరిస్టులు కూల్చి వేసినపుడు మరణించిన వారికి అంజలి ఘటించడానికి అమెరికన్లు అందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చి మృతులకు సంతాపం తెలిపారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. అది అమెరికన్ల కార్యక్రమం అయినప్పటికీ సాటి మనిషిగా నేను కూడా పాలు పంచుకున్నాను. సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మనమందరం మమేకం అవ్వడం మన విధిగా భావిస్తాను. ప్రధాని పిలుపు దేశమంతా స్పందించాలని కోరుకుంటున్నాను. నేను సైతం ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఫేస్ బుక్ లైవ్ ద్వారా మీ ముందుకు వస్తాను. కరోనా పై చేసే పోరాటంలో మన దృఢ చిత్తాన్ని చాటుకుందామని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి – పవన్ కళ్యాణ్
కరోనా ఎఫెక్ట్: తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న రామ్ చరణ్
కరోనా ఎఫెక్ట్: మార్చ్ 19 నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ మూసివేత
కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్ మహల్ మూసివేత
కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర పెంపు
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
[subscribe]