తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం సమన్వయ సమావేశం నిర్వహించింది. వైద్య, ఆరోగ్య, పురపాలక, పంచాయితీరాజ్శాఖల సమన్వయ సమావేశానికి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆయా శాఖల కార్యదర్శులు, తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశమనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా అన్ని మున్సిపాలిటీల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో హోర్డింగ్లు, వాల్ పోస్టర్లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. అందులో భాగంగా ప్రజారోగ్య&కుటుంబ సంక్షేమశాఖ- తెలంగాణ ప్రభుత్వం తరుపున ‘ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం’ అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాల సమాచారం, ఇతర వివరాల కోసం హెల్ప్లైన్ 040-24651119 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.