ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 147 పాజిటివ్ కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 6 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు మార్చ్ 18, బుధవారం నాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ విజృంభించి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
“ఈ మహమ్మారి విషయంలో ప్రభుత్వ విభాగాలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి స్క్రీనింగ్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు, ల్యాబ్లు పెంచాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను పాండమిక్ గా ప్రకటించిన తర్వాత కూడా తేలిగ్గా తీసుకోవడం సరికాదు. మన రాష్ట్రంలో లేదు, వైరస్ వస్తుంది, పోతుంది అనుకొనే తరుణం కాదిది. వైరస్ విస్తృతి మొదటి రెండు వారాల తర్వాతే ఉంటుందని ఇతర దేశాల అనుభవాల ద్వారా వెల్లడవుతోంది. రాజకీయ అవసరాల కోసం కరోనా విషయంలో ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు పోకూడదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
“కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటించాలని సూచించారు. కేంద్రం చెప్పిన విధంగా తక్షణమే అన్ని విద్యాసంస్థలను మూసివేయాలి. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు వైద్య బృందాలను నియమించాలి. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు ప్రజలను అప్రమత్తం చేయడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. జనసేన పార్టీ తరఫున మా శ్రేణులకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళిక ఇచ్చాం. ప్రజలకు ఈ వైరస్ విస్తృతిపై ప్రాథమిక అవగాహనా కల్పించడంతో పాటుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జనసేన నాయకులకు, జన సైనికులకు తెలియజేశామని” పవన్ కల్యాణ్ తెలిపారు.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
కరోనా ఎఫెక్ట్: తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న రామ్ చరణ్
కరోనా ఎఫెక్ట్: మార్చ్ 19 నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ మూసివేత
కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్ మహల్ మూసివేత
కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర పెంపు
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
[subscribe]