దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తోంది. ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో కరోనా కట్టడికోసం తీసుకునే చర్యల్లో భాగంగానే తాజ్ మహల్ మూసివేత నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో టికెట్ల ద్వారా ప్రవేశానికి అనుమతించే అన్ని చారిత్రక కట్టడాలు, మ్యూజియాలు, ప్రదర్శన శాలలను మార్చ్ 31 వరకు మూసివేస్తున్నట్టు మంగళవారం నాడు పర్యాటక శాఖా మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రకటించారు.
అదే విధంగా కరోనా ప్రభావంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఆలయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. దీంతో ఎక్కువుగా రద్దీగా ఉండే ప్రముఖ షిరిడీ ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. మార్చ్ 17, మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో షిరిడీ పర్యటనను సిద్దమైన భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర పెంపు
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం