టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్టోబర్ 25 శుక్రవారం నాడు బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరబోతున్నాడనే ఊహాగానాలు వస్తున్నా నేపథ్యంలో సుజనా చౌదరితో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం నాడు గన్నవరంలో అభిమానులు, కార్యకర్తలతో సమావేశమైన వంశీ పలు అంశాలపై వారితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ క్రమంలో మళ్ళీ ఈ రోజు గుంటూరులో బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలవడంతో ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.
ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలమేరకు గత కొన్ని రోజులుగా బీజేపీ ఎంపీలు గాంధీ సంకల్పయాత్రను చేపడుతున్నారు. ఈ రోజు గుంటూరులో బీజేపీ నిర్వహిస్తున్న సంకల్పయాత్రలో సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లభనేని వంశీ ఆయన్ను కలిసుకున్నారు, అనంతరం ఒంగోలు లో జరిగిన పాదయాత్రలో వారివురూ పాల్గొన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని వంశీ కలిసిన తరువాత పార్టీ మార్పుపై వార్తలు మొదలయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు కొంతమంది నాయకులు కూడ బీజేపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడ అక్టోబర్ 21 న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నా ఎమ్మెల్యే వంశీ కూడ పార్టీ మారతాడేమోనని నేతలు చర్చించుకుంటున్నారు.
[subscribe]