ప్రముఖ దిగ్గజ దర్శకుడు, పద్మశ్రీ, కళా తపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా స్థాయినీ, తెలుగు దర్శకుల సృజనాత్మకతనీ ఉన్నత శిఖరాన ఉంచిన దర్శక స్రష్ట కె.విశ్వనాథ్ గారు శివైక్యం చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నానని అన్నారు.
“విశ్వనాథ్ గారితో వ్యక్తిగతంగా నాకు మంచి పరిచయం ఉంది. అన్నయ్య చిరంజీవి గారితో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్భాందవుడు చిత్రాలు తీసినప్పటి నుంచి ఆయన తెలుసు. వారిని ఎప్పుడు కలిసినా తపస్సంపన్నుడైన జ్ఞాని మన కళ్ల ముందు ఉన్నట్లే అనిపించేది. భారతీయ సంస్కృతిలో భాగమైన సంగీతం, నృత్యాలను తన కథల్లో పాత్రలుగా చేసి తెరపై ఆవిష్కరించిన ద్రష్ట విశ్వనాథ్ గారు. ఇందుకు ఆయన తీసిన ‘శంకరాభరణం’, ‘సిరిసిరి మువ్వ’, ‘స్వర్ణ కమలం’, ‘సాగర సంగమం’, ‘సిరివెన్నెల’ లాంటివి కొన్ని మచ్చుతునకలు. ‘శారద’, ‘నేరము శిక్ష’, ‘ఉండమ్మా బొట్టుపెడతా’, ‘ఓ సీత కథ’, ‘స్వాతిముత్యం’, ‘సీతామాలక్ష్మి’ లాంటి చిత్రాల్లో మన జీవితాలను, మనకు పరిచయం ఉన్న మనస్తత్వాలను చూపించారు. కాబట్టే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. ‘కళా తపస్వి’గా ప్రేక్షకుల మన్ననలు పొందిన విశ్వనాథ్ చిత్రాలు తెలుగు తెరపై స్వర్ణ కమలాలుగా మెరిశాయి. నటుడిగా ఆయన పోషించిన పాత్రలు సినిమాలకు నిండుదనాన్ని తీసుకువచ్చాయి. తెలుగు సినిమా కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేసిన విశ్వనాథ్ గారి స్థానం భర్తీ చేయలేనిది. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE