”జగన్మోహన్ రెడ్డిగారూ… చూశారా.. ఈ ప్రభంజనాన్ని..! ఇక మీ ప్రభుత్వానికి తకధిమి తకధిమే..’ అంటూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారపార్టీని ఎండగట్టారు. అ..ఆ..ఇ..ఈలు చెప్పి వినూత్నంగా ఉతికి ఆరేశారు.. లక్షలాదిగా తరలివచ్చిన జనం మధ్య.., వైసీపీపై మహోద్యమానికి శ్రీకారం చుట్టారు.. ఇలాంటి ప్రభుత్వం మళ్లీ రాకుండా చేస్తానని సవాల్ విసిరారు. అశేష జనవాహినితో గుంటూరు పార్లమెంట్ పరిధి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పెమ్మసాని ఎన్నికల ప్రచారం.. ప్రత్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వామ్మో.. ఏమా జనం.. తొలి అడుగుకే ఇంతలా కదిలివచ్చారా.. ఆరంభంలోనే పెమ్మసాని దూకుడు ఇలా ఉంటే.. మున్ముందు ఆయనను తట్టుకోవడం చాలా కష్టం.. అంటూ వైసీపీ శిబిరంలో చర్చకు దారి తీసింది.
తెలుగుదేశం-జనసేన పార్టీల ఆధ్వర్యంలో తెనాలిలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమం గుంటూరు లోక్సభ పరిధిలో తీవ్ర చర్చకు దారి తీసింది. భారీసందోహంతో సాగిన ఈ కార్యక్రమంలో పెమ్మసాని తో పాటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుంచి కాలినడకన మొదలైన ఈ ప్రచారం పాత స్వరాజ్య థియేటర్ మీదుగా బోస్ రోడ్, గాంధీ చౌక్, షరాఫ్ బజార్ గుండా మున్సిపల్ కాంప్లెక్స్ వరకు సాగింది.
ప్రచారం జరుగుతున్న ప్రతిచోటా వ్యాపారులు, యువత, మహిళలు, వృద్ధులు ఇరు పార్టీల నాయకులకు గ్రాండ్ గా స్వాగతం పలికారు. నవయుగ హోటల్ సెంటర్ వద్దకు చేరేసరికి టిడిపి – జనసేన శ్రేణులు ఎక్స్ కవేరేటర్ సహాయంతో భారీ గజమాలను డాక్టర్ పెమ్మసాని, నాదెండ్లకు మెడలో వేసి హృదయపూర్వకంగా గౌరవించారు. మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత నాయకులు తమ ప్రచారాన్ని ముగించారు.
ఈ సందర్భంగా పెమ్మసాని చేసిన ప్రసంగం వింటే.. వహ్మా అనాల్సిందే. వైసీపీని చెండాడిన తీరును పరిశీలిస్తే.. రాజకీయంగా ఆయన ఎంత రాటుదేలారో అర్థం అవుతుంది. ”జగన్మోహన్ రెడ్డిగారూ.. చూస్తున్నారా ఈ ప్రభంజనాన్ని.. తొలి అడుగుకే తెనాలి పట్టణం.. తకధిమి.. తకధిమి.. ఆడిస్తా ఉంది. మీరు.. అ..ఆ..ఇ..ఈలో ఉన్న ప్రతి అక్షరానికీ అన్యాయం చేశారు.. అ అంటే.. అంగన్వాడీలకు అన్యాయం.. ఆ అంటే ఆరోగ్యశ్రీకి బిల్లులు కట్టడం లేదు.. ఇ అంటే ఇసుక కుంభకోణం.. ఉ అంటే ఉద్యోగస్తులకు అన్యాయం.. ప్రతి ఒక్కరికీ అన్యాయం చేస్తున్న వ్యక్తి.. జగన్మోహన్ రెడ్డి. రోడ్లు చూస్తే.. గుంతలే.. గుంతలు.. మందు చూస్తే బాదుడే.. బాదుడు.. నాయకులు చూస్తే బూతులే.. బూతులు.. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్లీ రాకుండా మీరందరూ జాగ్రత్త తీసుకుంటారని కోరుతున్నా..” అంటూ డాక్టర్ పెమ్మసాని మాట్లాడారు. జనానికి వాస్తవ పరిస్థితులు వివరిస్తూ.. మళ్లీ జగన్ వస్తే ఏం జరుగుద్దో హెచ్చరిస్తూ.. చేసిన తప్పులపై ప్రభుత్వాన్ని తూర్పారబడుతూ.. అందరినీ ఆకట్టుకున్నారు..
చివరిగా.. జై తెలుగుదేశం, జై జనసేన.. జై పవన్ కల్యాణ్.. జై నారా చంద్రబాబునాయుడు.. జై రంగాగారు.. జై మనోహర్ గారు.. జై కార్యకర్తలారా.. అంటూ తన ప్రసంగం ముగించారు. ఇదే కార్యక్రమంలో తెనాలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఈ చెత్త ప్రభుత్వం పోవాల్సిందేనని, దౌర్జన్యాలకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వాన్ని పారద్రోలాల్సిందేనని శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అతలాకుతలమైన ప్రజా జీవనాన్ని, ఈ రాక్షస రాజ్యం నుంచి విముక్తి కలిగించాలంటే పెమ్మసాని, మనోహర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమానికి తెనాలి నగర, నియోజకవర్గ కార్యకర్తలు ఇరు పార్టీల శ్రేణులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి.. విజయవంతం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ