విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేటతెల్లమయిన నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మృత్యువాత పడ్డారని, వీరిలో చిన్న పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారని అన్నారు. ఈ సంఘటన గతంలో చోటుచేసుకున్న భోపాల్ గ్యాస్ లీక్ విషాదాన్ని గుర్తు తెస్తోందని లేఖలో పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం, స్థానిక యువత తక్షణమే స్పందించి శరవేగంగా సహాయక చర్యలు చేపట్టడంతో మరణాల శాతం గణనీయంగా తగ్గించగలిగారని చెప్పారు. కానీ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణ ప్రమాదానికి కారణమన్నది వాస్తవమని అన్నారు.
ఈ దుర్ఘటనలో బాధితులు స్టెరైన్ వాయువు పీల్చడంతో జీవితాంతం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా భద్రత ప్రమాణాలు పాటించకుండా, పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకంగా నిబంధనలను ఉల్లంఘించి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పరిశ్రమ నడపడం, ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు తనిఖీ చేయడంలో విఫలమైనట్లు స్పష్టం అవుతోందని అన్నారు. బాధ్యులను శిక్షించకపోతే భవిష్యత్ లో ఇలాంటి మరిన్ని ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని, వారిని కఠినంగా శిక్షించాలని లేఖలో సీఎం వైఎస్ జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu