జాబితా ఎంపికలో తెలుగుదేశం పార్టీ ఈసారి తీవ్రమైన కసరత్తే చేసింది. పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ కీలకమైన అభ్యర్థులు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ అభ్యర్థులకు దీటుగా ఉన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణతో మాజీ మంత్రి, పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావు తలపడనున్నారు. ఇక్కడ పోటీచేస్తారనుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి భీమిలి టికెట్ సాధించారు. 2014లో ఆయన ఇక్కడి నుంచే విజయం సాధించారు. 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి మారారు. ఈ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో గంటా మరోసారి భీమిలి బరిలో దిగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి, ఒకప్పటి తన సన్నిహితుడైన అవంతి శ్రీనివాస్ను ఎదుర్కోనున్నారు.
జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్సభ స్థానాల్లో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. కళావెంకట్రావు గతంలో ఎచ్చెర్ల స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఎచ్చెర్ల సీటు పొత్తులో బీజేపీకి వెళ్లింది. కళాకు ప్రత్యామ్నాయం చూపాల్సి వచ్చింది. చీపురుపల్లిలో ఇప్పటికే ఆయన సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు. బొత్సను దీటుగా ఎదుర్కొనే క్రమంలో పార్టీ నాయకత్వం కళాకు ఈ టికెట్ ఇచ్చిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. పైగా కళా సామాజికవర్గమైన తూర్పుకాపులు చీపురుపల్లిలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ఆయనకు బంధువర్గం కూడా అధికంగా ఉండడంతో అధిష్ఠానం ఆయన వైపు మొగ్గింది.
అయితే.. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకుల మద్దతుదారులు పలు నియోజకవర్గాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. పలువురు నాయకులు పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి టికెట్ను కళా వెంకటరావుకి ఇవ్వడంపై కిమిడి నాగార్జున వర్గీయులు ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతల ఫ్లెక్సీలను చించేసి నిరసన తెలిపారు. కళా వద్దు.. నాగార్జున ముద్దు అంటూ నినాదాలు చేశారు. విజయనగరం పార్లమెంట్ ఇంచార్జ్, చీపురుపల్లి ఇంచార్జ్ పదవులకు కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడితే చివరికి నాకు క్షవరం చేశారు. కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుందని అమ్మా, నాన్నలు చెప్పారు. వారు చెప్పినట్లే పార్టీ కోసం కష్టపడ్డా కానీ లాబీయింగ్ చేస్తేనే పని జరుగుతుందని తెలుసుకోలేకపోయాను. నా అనుచరులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాన”ని అన్నారు.
స్థానికంగా సామాజికవర్గ బలం.. అంగబలం.. ఆర్థిక బలం ఉన్న బొత్సను ఢీకొట్టేందుకు చీపురుపల్లిలో కిమిడి కళావెంకట్రావు నిలిచినా.. ఆయనకు నిరసన సెగ తప్పడం లేదు. ఈక్రమంలో ఆయనతో స్థానిక టీడీపీ నేతలు ఎంత మంది కలిసి వస్తారో అన్న ఉత్కంఠ ఏర్పడింది. అధిష్ఠానం చొరవ చూపితే.. ఆ అసంతృప్తులు ఎంతో కాలం ఉండవనే ప్రచారమూ జరుగుతోంది. ఈక్రమంలో చీపురుపల్లి రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY