ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. మదురై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన రాత్రి 8 గంటల సమయంలో విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకున్నారు. కాగా మధురైలో వర్షం కారణంగా విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి రావడంతో ప్రధాని రావడం దాదాపు 30 నిమిషాలు ఆలస్యమైంది. ఈ క్రమంలో ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. ఇక సీఎం జగన్ తన మంత్రివర్గ సహచరులను, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులను ప్రధానికి పరిచయం చేశారు. అనంతరం బుల్లెట్ ప్రూఫ్ కారులో ఐఎన్ఎస్ డేగా మరియు పోర్ట్ కనెక్టివిటీ రోడ్ మీదుగా సాగిన రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఒక కి.మీ పైగా దూరం సాగిన ఈ రోడ్ షోలో ప్రధానిని చూడటానికి భారీగా తరలివచ్చిన ప్రజలు రోడ్డుకి ఇరువైపులా నిల్చుని ఆయనకు స్వాగతం పలికారు. అయితే రాత్రి సమయం కావడం, అప్పటికే షెడ్యూల్ ఆలస్యమవడం మూలాన భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని కారు లోపల నుంచే ప్రజలకు అభివాదం చేశారు. కాషాయ తలపాగాలు ధరించిన బీజేపీ మద్దతుదారులు పార్టీ జెండాలు, ప్లకార్డులు చేతబట్టి ప్రధానికి స్వాగతం పలుకుతూ.. ‘భారత్ మాతా కీ జై’, ‘మోదీ.. మోదీ’, ‘జై శ్రీరామ్’ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు. ప్రధాని కాన్వాయ్ వెళుతుండగా పెద్ద సంఖ్యలో గుమికూడిన జనం ఆయన కారుపై గులాబీ పూలరేకులు చల్లారు. ఇక ప్రధానితో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రోడ్ షోలో పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమం అనంతరం ప్రధానితో జనసేన పార్టీ (జెఎస్పి) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE