ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల పొత్తులు, నేతల ఎత్తులు తెర మీదకు వస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఒంటరిగా ఎన్నికలు వెళ్తుండగా.. పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నాయి.
మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ, జనసేన కూటమితో కలిసి ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టి ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ ఆగ్రనేతలతో కలిసి చర్చలు జరిపారు. ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో మరోసారి పొత్తులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సరిగ్గా ఇదే సమయంలో సీఎం జగన్ ఈరోజు ఢిల్లీకి వెళ్లడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అమరావతి నుంచి హస్తినకు బయల్దేరి వెళ్లిన జగన్.. బీజేపీ పెద్దలతో చర్చించడానికి ఎదురుచూస్తున్నారు. అయితే జగన్ అటు ఢిల్లీకి వెళ్లగానే..ఇటు పవన్ కల్యాణ్ అమరావతికి బయల్దేరి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
మంగళగిరి జనసేన కార్యాలయంలో పొత్తులు, సర్వేలపై పార్టీ నేతలతో పవన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో సీట్లు, అభ్యర్థుల ఎంపికపైనా పార్టీ నేతలతో చర్చించనున్నారు. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల రణరంగానికి సిద్ధం అవుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఏపీలో ఎవరిది గెలుపు అనే అంశంపై గురువారం కొన్ని సర్వేలు బయటకు రావడం..ఇప్పుడు నేతల హడావుడి చూస్తుంటే.. ఏపీలో రాజకీయాలు మరింత ఉత్కంఠను రేపుతున్నట్లే కనిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE