బీజేపీయేతర రాష్ట్రాలు కేంద్ర నిధుల కోసం గగ్గోలు పెడుతున్నాయి. కావాలనే ప్రభుత్వం వివక్ష చూపుతోంది అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వరం పెంచాయి. ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నాయి. దక్షిణ భారత రాష్ట్రాలపై మోదీ సర్కారు వివక్ష చూపుతోందని.. నిధులివ్వకుండా సతాయిస్తోందని దక్షిణాదిన కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లోని ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ముంగిట తమ పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్తున్నాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం హస్తిన వేదికగా ఇప్పటికే తమ నిరసనగళం విప్పింది. మిగిలిన రాష్ట్రాలుగా దశలవారీగా ఆందోళనలకు సిద్ధం అవుతున్నాయి.
పన్నుల ఆదాయం పంపిణీ, గ్రాంట్లలో గత కొన్నేళ్లుగా కర్ణాటకపై వివక్ష చూపుతోందని మోదీపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఫైర్ అయ్యారు. కరువు సాయం అందించకుండా దాటవేస్తోందని విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా గత ఐదేళ్లలో రూ.1.87 లక్షల కోట్లు నష్టపోయామని.. వాటిని తిరిగి చెల్లించాలని ధర్నా కూడా చేశారు. అలాగే.. కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా నిన్న ధర్నా చేపట్టింది. తమ రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అప్పులు తెచ్చుకోకుండా ఆంక్షలు పెడుతోందని, సమాఖ్య తత్వాన్ని దెబ్బతీస్తోందని సీఎం పినరయి విజయన్ ఆరోపిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూలేనంతగా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడుతోందని విమర్శిస్తున్నారు. దీనిపై కేరళ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్)కు తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ కూడా సంఘీభావం ప్రకటించారు.
మరోవైపు.. తమకు ఉపాధి హామీ పథకం బకాయిలు ఇవ్వడం లేదంటూ తూర్పు భారతంలో టీఎంసీ అధ్యక్షురాలు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం కోల్కతాలో నిరసన ప్రదర్శనకు పిలుపిచ్చారు. అయితే.. వారి ఆరోపణలను బీజేపీ కొట్టి పారేస్తోంది. ఎన్నికల స్టంట్ గా అభివర్ణిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక.. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో రాజకీయ స్టంట్ చేస్తోందని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ఎద్దేవాచేశారు. అలాగే.. కేరళ ఆర్థిక ఇబ్బందులకు కేంద్రంపై నెపం మోపలేమని ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్ స్పష్టం చేసింది. విజయన్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని.. దీనిని కప్పిపెట్టి కేంద్రంపై పడడమేమిటని నిలదీసింది.
బీజేపీయేతర రాష్ట్రాల ఆరోపణలతో కేంద్ర ఆర్థిక శాఖ స్పందిస్తోంది. పన్నుల ఆదాయం పంపిణీ, సంక్షేమ కార్యక్రమాల నిధుల్లో వివక్షకు తావుండదని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. రాష్ట్రాలకు నిధులపై ఆర్థిక సంఘం రూపొందించిన ఫార్ములానే ఆర్థిక శాఖ పాటిస్తుందని.. ఏ రాష్ట్రానికీ ప్రతికూలంగా గానీ, అనుకూలంగా గానీ వ్యవహరించడం జరుగదని తేల్చిచెప్పారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య జరిగిన వాగ్వాదాన్ని ప్రస్తావించగా.. రాజకీయ కోణంలోకి తాను వెళ్లనని.. అయితే వివక్ష ఎంత మాత్రం ఉండదని ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక సంఘం సిఫారసులు, కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ నివేదికల ఆధారంగా బకాయిలను నిలిపివేస్తుంటామని తెలిపారు. వీటిని మార్చడం కుదరదని, మార్గదర్శకాల ప్రకారమే నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. పథకాల నిధులకు సంబంధించి ప్రధాన రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో.. ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంత రాష్ట్రాలకైతే 90:10 నిష్పత్తిలో నిధుల పంపిణీ జరుగుతుందన్నారు. అయితే బీజేపీయేతర రాష్ట్రాలు మాత్రం ఆ నిష్పత్తిలో నిధుల కేటాయింపు ఉండడం లేదని అంటున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE