ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫిబ్రవరి 29, శనివారం నాడు రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను ముకేశ్ అంబానీ కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల వివిధ పరిశ్రమల ఏర్పాటు అంశంపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో ముకేశ్ అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్నత్వానీ, వైసీపీ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలకు ఎంపీ విజయసాయి రెడ్డి స్వాగతం పలికారు. ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట వద్ద రూ.15 వందల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కావాల్సిన రిలయన్స్ పరిశ్రమలు వెనక్కి వెళ్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
[subscribe]