తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, ఎంపీలు ఫిబ్రవరి 29, శనివారం నాడు గాంధీభవన్లో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్స్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలు ఈ సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా రైతు సమస్యలపైనే పోరాటం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. రైతు బంధు పథకం, ఇతర వ్యవసాయ సంబంధిత అంశాలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది.
ఈ సమావేశం ముగిసిన అనంతరం జీవన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా రైతుల రుణాలు ఇంకా మాఫీ కాలేదన్నారు. రైతు బీమా 59 ఏళ్లలోపు వారికే వర్తిస్తుందన్నారు. అలాగే రైతుబంధు పథకం రాష్ట్రంలో ఎవరికి అందుతుందో, ఎవరికి అందడం లేదో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొని ఉందని పేర్కొన్నారు. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలనే ప్రధానంగా ప్రస్తావిస్తామని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంచితే, టీఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్ముతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాగా ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు గైరాజరయ్యారు.
[subscribe]