రాజధాని అమరావతి ప్రాంతంలో స్టార్ట్-అప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు సింగపూర్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. ముందుగా స్టార్ట్-అప్ ఏరియా అభివృద్ధి కోసం సింగపూర్ కన్సార్టియమ్తో చేసుకున్న ఒప్పందాన్ని ముగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబర్ 11, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.
అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సంస్థల మధ్య వాటాలు నిర్ణయించుకుని ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ, ప్రాజెక్టులో ఆశించినంతగా అభివృద్ధి లేదని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(ఏపీసీఆర్డీఏ) కమిషనర్ తెలియజేసిన తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనితో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏడీసీఎల్) మరియు సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్ఏఐహెఛ్) మధ్య ఒప్పందం పూర్తిగా రద్దయిపోయింది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వలన రాష్ట్రంలో పెట్టుబడులపై గాని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సింగపూర్ కంపెనీ పెట్టుబడులపై గాని ఎలాంటి ప్రభావం ఉండబోదని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్పష్టం చేశారు.
[subscribe]