భారత సంతతికి చెందిన మరో మహిళ చరిత్ర సృష్టించబోతోంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల స్పేస్ లోకి ప్రయాణించే రెండవ భారత సంతతి మహిళగా నిలువనున్నారు. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్రిటిష్-అమెరికన్ స్పేస్ ఫ్లైట్ సంస్థ అయిన వర్జిన్ గెలాక్టిక్ ఈ నెల 11వ తేదీన మానవసహిత వ్యోమనౌకను నింగిలోకి పంపబోతోంది. ఇందులో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తో పాటుగా అంతరిక్షంలోకి ప్రయాణించే ఐదుగురిలో శిరీష బండ్ల ఒకరిగా ఉన్నారు. శిరీష బండ్ల ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాలు మరియు వ్యాపార అభివృద్ధి విభాగంలో పనిచేస్తోంది.”యూనిటీ 22 యొక్క అద్భుతమైన సిబ్బందిలో భాగం కావడం, అలాగే స్పేస్ ను అందరికి అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీలో భాగం కావడం చాలా గౌరవంగా ఉంది” అని శిరీష బండ్ల ట్వీట్ చేశారు.
శిరీష తల్లిదండ్రులు డాక్టర్ మురళీధర్ బండ్ల, అనూరాధ బండ్ల గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లి హోస్టన్ లో స్థిరపడ్డారు. స్పేస్ మీద ఆసక్తితో పర్డ్యూలోని యూనివర్సిటీలో ఆమె ఏరోనాటికల్-ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. అనంతరం జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ కూడా పూర్తి చేశారు. శిరీష సాధించబోయే ఈ ఘనతతో కల్పనా చావ్లా తర్వాత భారత్ లో పుట్టి స్పేస్లో అడుగుపెట్టబోతున్న రెండో మహిళగా ఆమె నిలవనుంది. అలాగే రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తరువాత భారత సంతతి నుంచి స్పేస్ లోకి వెళ్తున్న నాలుగో వ్యోమగామిగా శిరీష గుర్తింపు పొందనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ