ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల ఆ వెంటనే వైసీసీ ప్రభుత్వంపైకి విమర్శల బాణాలు ఎక్కు పెట్టిన విషయం తెలిసిందే. తన సోదరుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో వైసీపీ రాజీపడిందని షర్మిల ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా సహా మరే విషయంలోనూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేదని విమర్శించారు. ఇలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే చెల్లెలు షర్మిల వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తారా..? లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
అయితే ఆ చర్చకు తెరదింపుతూ.. వైఎస్ షర్మిలకు జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఉరవకొండలో జరిగిన వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో జగన్ ప్రసంగిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదే సమయంలో పరోక్షంగా షర్మిలపై కూడా విమర్శలు గుప్పించారు. అయితే ఒక్క చంద్రబాబును తప్పించి మిగతా ఎవరిపై కూడా జగన్ డైరెక్ట్గా పేరు పెట్టి విమర్శలు చేయరు. పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని విమర్శిస్తున్నారు.
ఈక్రమంలో షర్మిలపై కూడా ఇండైరెక్ట్గానే విమర్శలు చేశారు. చంద్రబాబు కోసం పక్క రాష్ట్రాల నుంచి స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారని విమర్శించారు. దత్తపుత్రుడు చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ అని పవన్పై మండిపడ్డారు. జెండాలు జతకట్టడమే వారి అజెండా అని విమర్శించిన జగన్.. ప్రజల గుండెల్లో గుడి కట్టడమే తన అజెండా అని చెప్పుకొచ్చారు. ప్రజలే తనకు స్టార్ క్యాంపెయినర్లని అన్నారు. తాను ప్రజలనే నమ్ముకున్నానని.. తన వల్ల మంచి జరిగివుంటే తప్పకుండా తనకోసం స్టార్ క్యాంపెయినర్గా రావాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ