ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం తక్షణమే అందచేయాలని డిమాండ్ చేస్తూ.. ‘రైతు పోరుబాట’ పేరుతో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర తణుకు వై జంక్షన్ వరకు 12 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ సందర్భంగా.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల సమస్యలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. పంటపొలాల్లోకి దిగి తడిసిన పంటలను, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక పాదయాత్రలో భాగంగా రోడ్డుపై ఆరబోసిన తడిసిన ధాన్యాన్ని చూసిన చంద్రబాబు, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడ రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే.. ముఖ్యమంత్రి కానీ, ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, వైసీపీ నేత కానీ రాలేదని, ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నానని జగన్ సర్కార్పై మండిపడ్డారు. పలువురు మహిళలు, రైతులతో ముఖాముఖీ మాట్లాడిన ఆయన వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని, నష్ట పరిహారం అందించేవరకూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. కాగా ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, శివరామరాజు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇక రైతు పోరుబాట పాదయాత్ర ప్రారంభానికి ముందు ఇరగవరంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE