కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరుగనుంది. మొత్తం 224 స్థానాలకు ఈనెల 10వ తేదీన జరిగిన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో 73.19 శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలో రేపటి కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కాగా ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగనున్నట్లు, ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటాపోటీ ఉంటుందని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ సంకీర్ణం తలెత్తితే జనతాదళ్(సెక్యులర్) చక్రం తిప్పనుంది. అయితే 2018 ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకూడదని ప్రతి పార్టీ కోరుకుంటున్నది.
ఇక ఇదిలా ఉండగా మరోవైపు కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రజాతీర్పు స్పష్టంగా రాదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. బీజేపీ కన్నా కాంగ్రెస్ కొంచెం ముందంజలో ఉండొచ్చని, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 113 మంది ఎమ్మెల్యేల మద్దతు రాకపోవచ్చునని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. అలాగే జేడీఎస్కు 25-30 స్థానాలు లభించే అవకాశం ఉందని విశ్లేషించాయి. దీంతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా తప్పనిసరిగా జేడీఎస్ మద్దతు కోరాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. మరోసారి ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించేందుకు జేడీఎస్ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో తన వంతు పాత్ర పోషించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించింది.
ఈ మేరకు ఎన్నికలు పూర్తయ్యాక జేడీఎస్ అగ్ర నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమార స్వామి సింగపూర్ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ.. జేడీఎస్ కనీసం 50 స్థానాల్లో గెలుస్తుందని భావిస్తున్నామని, మా విధానాలకు అంగీకారం తెలిపే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మేం సిద్ధం అని ప్రకటించారు. దీంతో రేపటి ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక మరోవైపు జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాన మంత్రి హెచ్డీ దేవె గౌడ ఇటీవల మాట్లాడుతూ.. కాంగ్రెస్తో జేడీఎస్ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం గమనార్హం. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతి పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ఓ సంవత్సరం తర్వాత ఆ ప్రభుత్వం కుప్పకూలింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE