అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాద ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ జిల్లాలో పారిశ్రామికవాడలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఇది ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ మొదలుకుని పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు జరగడం, ఈ కారణంగా కార్మికులు బలవ్వడం సాధారణమైపోయిందని అన్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని, ప్రమాదాలపై కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అలాగే క్షేత్ర స్థాయిలో అధికారులు తనికీలు చేస్తుండాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సకాలంలో పరిహారం చెల్లించాలని, బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
అచ్యుతాపురం సెజ్లోని సీడ్స్ వస్త్రపరిశ్రమలో ఇదే ఏడాది జూన్ 3న విషవాయువులు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, నాటి ప్రమాదంపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించినా ఇప్పటివరకు ప్రమాదానికి కారణాలేంటో కమిటీ చెప్పలేకపోయిందని చంద్రబాబు అన్నారు. అదే పరిశ్రమలో ఇప్పుడు మరోసారి వెలువడిన విషవాయువును పీల్చి దాదాపు 100 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారని, అలాగే నిన్న తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి లోని బయోటెక్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ క్లీన్ చేసే క్రమంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని తెలిపారు. ఏప్రిల్ నెలలో ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగి ఆరుగురు కార్మికులు మరణించారని గుర్తు చేశారు. ఈ ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY