టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన తమ పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఇంటికి చేరుకొని ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తోందని, వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. భయపడాల్సిన పనిలేదని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఇక అంతకుముందు ఆయన సెంట్రల్ జైలులో టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు మరియు ఆదిరెడ్డి వాసును కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు ఉన్నారు.
కాగా జగజ్జననీ చిట్ఫండ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు)ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా సీఐడీ అధికారులు రాజమహేంద్రవరంలోని ఆదిరెడ్డి ఇంటికి వెళ్లి తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు, వాసులను జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీంతో వారిద్దరికీ ఈనెల 12 వరకు రిమాండ్ విధిస్తూ తూర్పుగోదావరి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అప్పారావు, వాసులను పోలీసులు రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. టీడీపీ నేతల అరెస్టును ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE