హైదరాబాద్లో ఘనంగా నిర్వహించే ఆషాఢ బోనాల వేడుకలు వచ్చే నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని, జంటనగరాల్లోని అన్ని ఆలయ కమిటీలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులను దాఖలు చేయాలని కోరారు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ మేరకు ఆయన హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం గోల్కొండలో ఆషాడ బోనాల ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత, సికింద్రాబాద్ బోనాలు.. అనంతరం ఓల్డ్ సిటీ బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 22న గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయని, జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, అలాగే 10 వ తేదీన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ (భవిష్యవాణి) నిర్వహిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు.
ఇక జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు ఉంటుందని, అంతకుముందుగా జూన్ 20న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ తెలిపారు. కాగా మహాంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్ధమై ఆలయాన్ని అభివృద్ధి చేశామని, దీనిలో భాగంగా ఆలయం పరిసరాల్లోని రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేసినట్లు వివరించారు. కాగా అమ్మవారి బోనాల తర్వాతి రోజు వివిధ వేషధారణలు, డప్పు చప్పుళ్ళు, కళాకారుల నృత్యాలతో ఫలహారం బండ్ల ఊరేగింపు నిర్వహిస్తున్నామని, ఈ వేడుక ఉత్సవాలకే ప్రత్యేక కళను తీసుకొస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
ఇక ఉత్సవాల ప్రారంభానికి ముందే ఆలయ నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా అధికారులు, ఆలయ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని కోరారు. ఈ క్రమంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని దేవాలయాలతో పాటు ప్రైవేట్ ఆలయాలకు కూడా ఆర్థిక సహాయం అందజేస్తామని, ఉత్సవాల నిర్వహణకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్కు కూడా నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే హైదరాబాద్లోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నామని, దమయంతీ ఆలయం, ఢిల్లీ దర్వాజ, గోల్కొండ, రవీంద్ర భారతి, కట్ట మైసమ్మ ఆలయం, ఇందిరాపార్క్, సికింద్రాబాద్లోని మహంకాళి ఆలయం, చిలకలగూడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE