ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టికల్ 360 కింద ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం నియమ నిబంధనలను పాటించకుండా ఇష్టారీతిన ఆర్థిక లావాదేవిలను నిర్వహిస్తోందని, కావున దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ రోజు మీడియా సమావేశంలో యనమల మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరపు బడ్జెట్లో రూ.1.78 లక్షల కోట్లు ఖర్చుపెట్టినట్లు చూపించిందని, కానీ దీనిలో రూ.48 వేల కోట్ల పైగా లెక్కలు చెప్పడం లేదని స్వయంగా కాగ్ పేర్కొందని తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిపై అసత్యాలు చెప్తోందని, స్పెషల్ బిల్లుల పేరుతో ఖర్చుపెట్టామంటున్నారని వెంటనే కేంద్రం ఈ తప్పుడు లెక్కలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఈ ధనమంతా ఏమైందనేది లెక్క తేల్చాలని, దీనిపై సీబీఐ విచారణ అవసరమని స్పష్టం చేశారు. కేంద్రం దీనిపై దృష్టి సారించాలని, లేని పక్షంలో రాష్ట్రం ఆర్ధికంగా పతనమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏడాదిగా ప్రతిరోజూ వేజ్ అండ్ మీన్స్ కింద అప్పులుతెచ్చారని, ఓడీ రూపంలో కూడా అప్పులు తెచ్చారని.. కానీ, వేటికీ సరైన లెక్కలు చెప్పటం లేదని విమర్శించారు. చివరికి న్యాయస్థానాల తీర్పులపై చట్టసభల్లో చర్చ నిర్వహిస్తున్నారని, న్యాయస్థానాల తీర్పులకు వక్ర భాష్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. అందుకే, వీటన్నింటిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని యనమల రామకృష్ణుడు కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ