కుప్పంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో గత రెండు రోజులుగా పర్యటిస్తుండటం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయన చేపట్టనున్న రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి నిరాకరించిన పోలీసులు టీడీపీ ప్రచార వాహనాన్ని నిలిపివేయడంతో పాటు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లిలో టీడీపీ కార్యాలయం వద్దకు ర్యాలీగా బయలుదేరగా మార్గం మధ్యలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఇప్పటికే తన పర్యటనలో ఆంక్షలు విధించడం, తన ప్రచార వాహనం ఇవ్వక పోవడం తదితర కారణాలతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు పోలీసుల వైఖరిని నిరసిస్తూ గుడిపల్లిలోని స్థానిక బస్టాండ్ సమీపంలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందని, నా సొంత నియోజకవర్గంలోకి నన్ను రానివ్వకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు చట్టప్రకారం నడుచుకోవడం లేదని, అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. జీవో నెం.1 చట్టవిరుద్ధమని తెలిపిన ఆయన, అధికార పార్టీ నాయకులు పెట్టే సభలు, ర్యాలీలు పోలీసులకు కనపడటం లేదా? అని మండిపడ్డారు. సీఎం జగన్ కూడా ఇటీవల రాజమండ్రిలో రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొన్నారని, వారికి లేని జీవో రూల్ ప్రతిపక్ష నాయకులకు ఎలా వర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇక్కడి నుంచి కదలనని, అధికారులు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE