ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తయిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్స్ చేశారు. “వైసీపీ పాలనకు ఏడాది పూర్తయ్యింది. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి 6నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నాం. కానీ తొలిరోజు నుంచే వైసీపీ పాలకులు అరాచకాలు మొదలుపెట్టారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది మొత్తం యధేచ్ఛగా సాగించారు. సమాజానికి చెడు చేసే చర్యలను, ప్రజా వ్యతిరేక పాలనను తెలుగుదేశం సహించదు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలం అయ్యారు. అవివేక నిర్ణయాలతో నమ్మిన ప్రజలనే నట్టేట ముంచారని” చంద్రబాబు అన్నారు.
“రైతులు, పేదలు, మహిళలు, రైతుకూలీలు, భవన నిర్మాణ కార్మికులు, యువత, ఇలా అన్నివర్గాల ప్రజలను రోడ్డెక్కించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది కుటుంబాలు 164 రోజులుగా అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇటు న్యాయం కోసం అమరావతి ప్రజలు, అటు విశాఖలో విషవాయు బాధితులు, మరోవైపు కరోనాతో కర్నూలు వాసులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు వెనక్కి పోయి ఉద్యోగాలు లేని యువత, ఇన్ని విషాదాల్లో వైసీపీ ఏడాది పాలన ఉత్సవాలా..? ఏం సాధించారని? ఎవరికేం ఒరగబెట్టారని? ఇకనైనా బాధ్యతగా పనిచేయండని” చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu