మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత గ్రామాల రైతులు గత 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులుగా దీక్షలు, ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందనలేదని భావిస్తున్న రైతులు, ప్రజలు మలిదశ ఉద్యమానికి సిద్ధమవుతూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి (జనవరి 3, శుక్రవారం) నుంచి సకల జనుల సమ్మె చేపట్టాలని నిర్ణయించుకున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో సకలజనుల సమ్మె చేస్తామని ప్రకటించారు. కమిటీలతో ఎలాంటి ప్రయోజనం లేదని, రెండో దశ ఉద్యమం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పాల సరఫరా మినహా ఇతర అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని చెప్పారు.
మరోవైపు రాజధానిపై బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) కూడా శుక్రవారం నాడు నివేదిక సమర్పించనుంది. రాజధానిపై పూర్తిస్థాయి నివేదికను బోస్టన్ కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించనున్నారు. ఇప్పటికే సమర్పించిన జీఎన్రావు కమిటీ నివేదికతో పాటుగా, బీసీజీ నివేదికను సైతం ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. రెండునివేదికల పరిశీలన అనంతరం హైపవర్ కమిటీ ఇచ్చే రిపోర్టును కేబినెట్ లో చర్చించి రాజధానిపై నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తునట్టు తెలుస్తుంది.
[subscribe]