నంద్యాల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాలలో ప్రవేశించిన సందర్భంగా.. పార్టీలోని కీలక నేతలైన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఘర్షణ జరగడం తెలిసిందే. ఈ క్రమంలో అఖిల ప్రియ అనుచరులు దాడి చేయడంతో, సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఉదయం అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ సహా మొత్తం 11 మందిని నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై పార్టీ అధినేత చంద్రబాబు అక్కడి నేతలను ఆరా తీశారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నంద్యాల ఘటనపై ముగ్గురు సీనియర్ సభ్యులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యక్రమాల్లోకి చొరబడి ఘర్షణలకు పురిగొల్పుతున్నారని, ఇలాంటి వాటి పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే విధంగా పార్టీలోని నేతలు అందరూ సమన్వయంతో వ్యవహారించాలని, ఎక్కడైనా వారికి సమస్యలు ఎదురైతే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE