టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏపీలోని ఏలూరు జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి విజయవాడ మీదుగా మైలవరం, తిరువూరు, సత్తుపల్లి, అశ్వారావుపేటల మీదుగా వేలేరుపాడు మండలం చేరుకుంటారు. అక్కడ శివకాశిపురం పాఠశాలలో పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులను పరామర్శించి మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో కుక్కునూరులో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.
అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్లో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి రాత్రికి భద్రాచలంలో బస చేయనున్నారు. శుక్రవారం తెలంగాణలోని ఏపీలో విలీనమైన ఏటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లిలో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. కాగా ఇక్కడి విలీన గ్రామాల ప్రజలు తమను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ వల్ల భద్రాచలం ముంపు సమస్య తలెత్తిందని తెలంగాణ నేతలు ఆరోపిస్తుండగా, ఏపీ మంత్రులు ఈ ఆరోపణలను కొట్టి పడేస్తున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించిన తర్వాత ఖమ్మం జిల్లా పరిధిలోని ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటించనుండటం సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది. కాగా చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ