టీడీపీ సీనియర్ నాయకుడు, నటుడు, మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ కన్నుమూసారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. శివప్రసాద్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేసి సేవలందించారు. పలు చిత్రాల్లో నటించి పేరుగాంచారు, కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు, నిర్మాతగాను వ్యవహరించారు. స్వతహాగా కళాకారుడు కావడంతో పార్లమెంట్ ఆవరణలో వినూత్న నిరసనలతో, వివిధ వేషధారణలతో సమస్యలపై పోరాడేవారు. శివప్రసాద్ ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రమే అపోలో ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
ఎన్.శివప్రసాద్ వ్యక్తిగత- రాజకీయ ప్రస్థానం:
- శివప్రసాద్ 1951 జులై 11న చిత్తూరుజిల్లా పొట్టిపల్లిలో జన్మించారు
- తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తీ చేసారు
- రంగస్థల అనుభవంతో సినిమా రంగంలోకి ప్రవేశించారు
- క్యారక్టర్ నటుడిగా, ప్రతినాయకుడిగా పలు సినిమాల్లో నటించారు
- కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు, మరికొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు
- సినిమాల్లో నటిస్తూనే రాజకీయ రంగప్రవేశం చేసారు
- టీడీపీ పార్టీలో చేరి 1999-2004 మధ్య కాలంలో సత్యవేడు ఎమ్మెల్యేగా సేవలందించారు
- అదే సమయంలో రాష్ట్ర సమాచార సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు
- 2009, 2014 ఎన్నికలలో చిత్తూరు లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించి ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు
- 2019 లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు
- స్వతహాగా కళాకారుడు కావడంతో పార్లమెంట్ ఆవరణలో వివిధ వేషధారణలతో సమస్యలపై పోరాడేవారు
- రాష్ట్ర విభజన సమయంలో, ప్రత్యేక హోదా కోసం పోరాడిన సమయంలో కూడ పలురకాల వ్యక్తులను అనుసరిస్తూ, కొత్త వేషధారణతో అందరి దృష్టిని ఆకర్షించి పోరాడేవారు
- పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడ గొప్ప గొప్ప వ్యక్తుల వేషధారణ గావించి ప్రజల సమస్యలు పై తన గళాన్ని వినిపించేవారు
- గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
[subscribe]