తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు అంశం ఏపీలో కాక రేపుతోంది. గతంలో పలుమార్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఢిల్లీకి వెళ్లి బీజేపీతో పొత్తులపై చర్చలు జరిపారు. ఈనెల 7న మరోసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో కలిసి పొత్తు గురించి చర్చలు జరిపారు. ఆ తర్వాత పొత్తుపై అటు బీజేపీ సానుకూలంగా ఉందని.. పొత్తు ఖరారయినట్లేనని వార్తలొచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలవడబోతోందని గుసగుసలు వినిపించాయి.
కానీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్లొచ్చి 15 రోజులు అవుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు గురించి అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు, బీజేపీ పెద్దలు మాత్రం ఎక్కడా ఆ మాట ఎత్తడం లేదు. 2014 పొత్తులు.. 2024లో రిపీట్ అవుతాయని.. టీడీపీతో బీజేపీ పొత్తు కోసం తాను చివాట్లు తినాల్సి వచ్చిందని ఇటీవల పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. తాను పొత్తు కోసం చాలా తగ్గి వ్యవహరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇలా ఒక్క పవన్ మాత్రమే పొత్తుల గురించి మాట్లాడుతున్నారు.
అయితే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారయిపోయిందని వార్తలొస్తున్నప్పటికీ.. ఇప్పటికే అధికారికంగా ప్రకటించకపోవడంతో జనాలు అయోమయంలో పడ్డారు. వారం పది రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండగా.. ఇప్పటికీ పొత్తు గురించి ప్రకటించకపోవడం చర్చనీయాంశమయింది. అయితే సీట్ల సర్దుబాటు ఇంకా తేలలేదని.. అందుకే పొత్తుల గురించి ప్రకటన ఆలస్యమవుతోందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 8 నుంచి 10 ఎంపీ స్థానాలు.. 15 నుంచి 20 అసెంబ్లీ స్థానాలను డిమాండ్ చేస్తోందట.
గతంలో చంద్రబాబు బీజేపీ డిమాండ్కు ఓకే చెప్పినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన బీజేపీకి 5 ఎంపీ 9 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. బీజేపీకి 2 ఎంపీ.. 25కు పైగా అసెంబ్లీ స్థానాలు ఇస్తుండడంతో.. అంతకు మించిన స్థానాలు బీజేపీకి ఇవ్వలేమని చంద్రబాబు అంటున్నారట. కానీ అటు బీజేపీ మాత్రం చంద్రబాబు ప్రతిపాదనను అంగీకరించడం లేదట. ఖచ్చితంగా 8 నుంచి 10 లోక్ సభ స్థానాలు ఇవ్వాల్పిందేనని పట్టుబడుతోందట. ఈక్రమంలో బీజేపీ కోరుతున్న స్థానాలపై చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారట. అందుకే పొత్తులపై అధికారిక ప్రకటన ఆలస్యమవుతోందట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE