ఎన్నికలొస్తే చాలు చర్చనీయాంశమయ్యే అంశం డబ్బు. ఎన్నికల వేళ డబ్బులు ఏరులై పారుతుంటాయి. గెలుపు కోసం నేతలు విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అప్పటి వరకు దాచుకున్న డబ్బంతా ఎన్నికలవేళ బయటికి తీస్తుంటారు. ఎన్నికల ఖర్చుపై ఎన్నికల సంఘం నియమ నిబంధనలు విధించినప్పటికీ.. కొందరు నేతలు వాటిని అతిక్రమించి డబ్బులు ఖర్చు చేస్తుంటారు. అయితే త్వరలో ఎన్నికలు జగరబోతుండగా.. డబ్బుపై జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఖర్చు చేయకుండా రాజకీయాలు చేయడం కుదరదని వ్యాఖ్యానించారు.
బుధవారం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఆ తర్వాత పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈరోజుల్లో కుదరని పని అన్న పవన్.. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని తాను అన్నట్లు ప్రచారం చేస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. తాను అలా ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ఖర్చును రూ. 45 లక్షలకు పెంచిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందేనని.. ఎన్నికల్లో నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. కనీసం భోజనాలకోసమైనా నేతలు ఖర్చుపెట్టుకోకపోతే ఎలా అని పవన్ ప్రశ్నించారు. అలాగే ఓట్లు కొంటారా లేదా అన్నది నాయకుల ఇష్టమని పవన్ వ్యాఖ్యానించారు. కనీసం 2029 తర్వాతనైనా డబ్బులతో ఓట్లు కొనని రాజకీయం రావాలన్న పవన్.. అప్పుడు నిజమైన డివలప్మెంట్ జరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే డబ్బులు లేకుండా రాజకీయం చేయమంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE