ప్రముఖ తెలుగు దిగ్గజ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కాశీనాధుని విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన వయసు 92 సంవత్సరాలు. విశ్వనాథ్కు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కి జాతీయస్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ‘శంకరాభరణం’ సినిమా 1980 ఫిబ్రవరి 2న విడుదలవగా.. యాదృచ్ఛికంగా అదే రోజున ఆయన కన్నుమూయడం గమనార్హం. ఇక ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో కె. విశ్వనాథ్ యాభైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఇక విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని భట్టిప్రోలు మండలం పెద పులివర్రు గ్రామంలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, తల్లి సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆయన, అనంతరం 1949లో ఆంధ్ర క్రైస్తవ కళాశాల నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. ఆయన తండ్రి మరియు మేనమామ చెన్నైలోని విజయవాహినీ సంస్థలో పనిచేసేవారు. వారి ప్రోద్భలంతో వాహినీ స్టూడియోలో తొలుత సౌండ్ రికార్డిస్ట్గా జీవితాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో విజయా సంస్థ నిర్మాణంలో తెలుగు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ సినీ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిన ’పాతాళ భైరవి’ సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్గా పనిచేశారు.
ఆ తర్వాత అన్నపూర్ణ సంస్థలో అప్పటి అగ్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద అసోసియేట్గా చేరి కథారచనతో పాటు ఇతర మెళకువలు ఒంటబట్టించుకున్నారు. ఈ సమయంలో విశ్వనాథ్ పనితనాన్ని దగ్గరనుంచి గమనించిన ఆ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదన రావు ‘ఆత్మగౌరవం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేశారు. ఇక అక్కడినుంచి విశ్వనాథ్ తనదైన శైలిలో సినిమాలు రూపొందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మేటినటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా అప్పుడప్పుడే పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంటున్న వర్ధమాన కథానాయకులు కృష్ణ, శోభన్బాబులతో పాటు చంద్రమోహన్ వంటి నటులతో మంచి చిత్రాలు తీశారు. అలాగే కమల్ హాసన్తో విశ్వనాథ్ కు ప్రత్యేక అనుబంధం ఉండేది. వారిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.
ఇక కె. విశ్వనాథ్ తెలుగులో 41, హిందీలో 10 కలిపి మొత్తం సినిమాలకు దర్శకత్వం వహించారు. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, సంగీత సాహిత్యాల మేళవింపుతో విలువలతో కూడిన సినిమాలు తీయడం విశ్వనాధ్ నైజం. సప్తపది, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, స్వర్ణకమలం, శృతిలయలు, సూత్రధారులు వంటి అద్భుత కళాఖండాలను ఆయన రూపొందించారు. దాదాసాహెబ్ఫాల్కే, పద్మశ్రీ వంటి విశిష్ట అవార్డులతో పాటు మరెన్నో గొప్ప పురస్కారాలను అందుకున్నారు విశ్వనాథ్. కాగా కళాతపస్వి మరణంతో చిత్రపరిశ్రమలోని ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE