ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచేసింది. కర్ణాటక, తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా తమ హవా చాటాలని ముందుకు కదులుతోంది. ఇప్పటికే ఏపీలో పార్టీకి పూర్వవైభం తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ పగ్గాలు అప్పగించింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించింది. ఆదివారం షర్మిల ఏపీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే షర్మిల ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే గతంలో కాంగ్రెస్లో పని చేసిన వారు.. వైసీపీలో టికెట్ దక్కని వారు.. జనసేన-టీడీపీ కూటమిలోకి వెళ్లేందుకు ఇష్టంలేని వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు నేతలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరుతామని ప్రకటించగా.. మరికొందరు నేతలు కాంగ్రెస్లో చేరేందుకు తెర వెనుక మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్లోకి వెళ్తే తప్పకుండా టికెట్ దక్కుతుందని నేతలు భావిస్తున్నారట. అందుకే కాంగ్రెస్లో చేరేందుకు పెద్ద ఎత్తున నేతలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఆదివారం షర్మిల ఏపీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇటీవల తన పదవికి, వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. షర్మిల కాంగ్రెస్లో చేరితే తాను కూడా ఆమె వెంటే నడుస్తానని ఆర్కే ప్రకటించారు. ఈక్రమంలో ఆదివారం షర్మిల సమక్షంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
అలాగే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఆదివారం కాంగ్రెస్లో చేరుతారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఈసారి వైసీపీ టికెట్ నిరాకరించడంతో.. రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్త పరిచారు. ఇప్పుడు పార్టీ మారేందుకు రామచంద్రారెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డితో రామచంద్రారెడ్డి మంతనాలు జరిపారు. ఈక్రమంలో ఆదివారం షర్మిల సమక్షంలో రామచంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు తన అనుచరులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ