తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి అప్పుడే మొదలయిపోయింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. అత్యధిక స్థానాలు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయిన బీఆర్ఎస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో అయినా మెజార్టీ స్థానాలు దక్కించుకొని హస్తినాలో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే లోక్ సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది.
ముఖ్యంగా బీఆర్ఎస్కు కంచుకోట అయిన మెదక్ టికెట్ కోసం సంఖ్యలో నేతలు పోటీపడుతున్నారు. ఏకంగా ఐదుగురు నేతలు తమకంటే.. తమకే టికెట్ ఇవ్వాలని అంటున్నారు. వరుసగా నాలుగు సార్లు మెదక్లో బీఆర్ఎస్ విజకేతనం ఎగుర వేసింది. 2004లో బీఆర్ఎస్ తరుపున కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర పోటీ చేశారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2009 లో సినీ నటి విజయశాంతి మెదక్ నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు.
ఇక 2014లో గులాబీ బాస్ కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేయడంతో మెదక్లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా ప్రభాకర్ రెడ్డి రెండోసారి మెదక్లో గెలుపొంది లోక్సభకు ఎంపికయ్యారు. ఇలా వరుసగా గెలవడంతో మెదక్ బీఆర్ఎస్కు కంచుకోటగా మారింది. ఈక్రమంలో అక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా గెలిచి తీరుతామని నేతలు అనుకుంటున్నారట. అందుకే పెద్ద ఎత్తున నేతలు టికెట్ కోసం పోటీపడుతున్నారు.
అయితే కొద్దిరోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చివరి నిమిషంలో కేసీఆర్ పోటీ నుంచి తప్పుకుంటే.. ఆ టికెట్ కోసం నలుగురు నేతలు పోటీ పడుతున్నారట. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఒంటేరు ప్రతాప్ రెడ్డిలు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఈ నలుగురిలో బీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ