విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం చేరుకొని గ్యాస్ లీక్ ఘటన బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
అందుకు అనుగుణంగా ఈ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో బాధితులకు పరిహారం కోసం రూ.30 కోట్లను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మృతుల కుటుంబాలతో పాటు తీవ్ర అస్వస్థతకు గురైన వారికీ, ప్రభావితమైన వారికీ పరిహారం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకోసం మొత్తంగా రూ.30 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మే 8, శుక్రవారం నాడు విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున, వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు చొప్పున, అస్వస్థతతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయలు, అలాగే ఈ ఘటనలో ప్రాథమిక స్థాయి చికిత్స పొందిన వారికి ₹25 వేలు, ప్రభావిత గ్రామాల్లో ఇంటికి రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ మేరకు రూ.30 కోట్లు పరిహార మొత్తాన్ని జిల్లా కలెక్టర్ ఖాతాకు బదిలీ చేసి, ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం తక్షణమే బాధితులకు పరిహారాన్ని అందించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu