ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలంటూ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ మండలి కార్యదర్శికి ఫైలును పంపగా, ఈ నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ మండలి కార్యదర్శి దాన్ని వెనక్కి తిప్పి పంపారు. తాజాగా ఛైర్మన్ షరీఫ్ మరోసారి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ఫైలును కార్యదర్శికి పంపగా, రెండోసారి కూడా ఆయన తిప్పి పంపారు. ఈ సందర్భంగా ఛైర్మన్కు పంపిన నోట్లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని శాసన మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. క్లాజ్ 189 ఏ ప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తుంది.
మరోవైపు శాసన మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తీరుపై టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. సెలెక్ట్ కమిటీ ఫైలును మరోసారి వెనక్కి పంపటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం సభా నియమాలను కార్యదర్శి ఉల్లఘించడం కిందే వస్తుందని విమర్శించారు. శాసనమండలి సభ్యులు ఎవరైనా కార్యదర్శి నిర్ణయంపై నోటీసులు ఇవ్వొచ్చని అన్నారు. ఈ అంశంలో కార్యదర్శిపై క్రమశిక్షణ చర్యల కింద ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారమైన చైర్మన్కు ఉందని స్పష్టం చేశారు. సెలెక్ట్ కమిటీ ఫైలును వెనక్కి పంపటంపై పార్టీలో చర్చించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
[subscribe]