విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన ఇటీవల భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది మృతి చెందగా, దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఈ ఘటనపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఏన్టీటీ) స్పందించి ఎల్.జి.పాలిమర్స్ సంస్థకు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏన్జిటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ దుర్ఘటనకు కారణమైన ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమను ఏన్జిటీ నియమించిన కమిటీ ఛైర్మన్ జస్టిస్ శేషశయనారెడ్డి ఈ రోజు సందర్శించనున్నారు. ఈ కమిటీలో ఇతర సభ్యుల బృందం మూడు రోజుల క్రితమే ఎల్.జి.పాలిమర్స్ కంపెనీని సందర్శించి, ప్రభావిత గ్రామాల్లో విస్తృతంగా పర్యటించింది. ఈ రోజు శేషశయనారెడ్డి పరిశ్రమను సందర్శించి ఈ స్థాయి ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టబోతున్నారు. అనంతరం గ్యాస్ లీకేజ్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించి బాధితులు, సంబంధిత అధికారులతో సమావేశం కానున్నారు. మరోవైపు స్టైరీన్ గ్యాస్ పీల్చడం వలన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరూ పూర్తిగా కోలుకున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా నష్ట పరిహారం చెల్లించి బాధితులను డిశ్చార్ చేసినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu