ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయనీ, ముఖ్యంగా కౌలు రైతులు సుమారు 3 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డా వైసీపీ ప్రభుత్వంలో స్పందన లేకపోవడం దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సాయం చేయడంలో కూడా కులం కోణం చూడటం ఏమిటన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల కడగండ్లకు ప్రభుత్వ విధానాలే కారణమని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రైతు స్వరాజ్య వేదిక క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి కౌలు రైతుల స్థితిగతులపై రూపొందించిన నివేదికను అందచేశారు. వీరి ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. రైతాంగం కష్టాలపై త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిద్దాం అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో పండే వరి పంటలో 80 శాతం కౌలు రైతుల సేద్యం నుంచి వస్తున్నదే. ఇంతటి కీలకమైన పంట వేసి నష్టాల పాలై, అప్పులు తీర్చలేక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. వరితోపాటు మిర్చి, పత్తి లాంటి పంటలు వేసినవారూ నష్టపోతున్నారు. రైతు భరోసా యాత్రల సందర్భంలో కౌలు రైతుల కుటుంబాల ఆవేదన నేరుగా తెలుసుకొంటున్నాను” అని అన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఇప్పటి వరకూ చేసిన రైతు భరోసా యాత్రల్లో 8 జిల్లాల్లో 700కి పైగా కౌలు రైతు కుటుంబాలకి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశాం. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన తరపున భరోసా కలిగించగలుగుతున్నాం. జనసేన పార్టీ తొలి నుంచి రైతు పక్షం వహిస్తోంది. వరి పంట కొనుగోలు చేసి కూడా డబ్బులు ఇవ్వకపోతే రైతు సౌభాగ్య దీక్ష చేశాం. అదే విధంగా నివర్ తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతుల కోసం నిలబడ్డాం” అని అన్నారు. ఈ సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక నుంచి కిరణ్ కుమార్ విస్సా, బి.కొండల్ రెడ్డి, బాలు గాడి, కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ప్రతినిధులు శ్రీహర్ష, భార్గవి పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE