మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించిన దర్యాప్తు ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేస్తామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసుకి సంబంధించి బుధవారం సుప్రీంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగంగా సాగటం లేదని పేర్కొంటూ, దర్యాప్తు అధికారులను మార్చాలని కోరుతూ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు దీనిపై విచారణ జరిపిన కోర్టు, దర్యాప్తు అధికారి రాంసింగ్ను కొనసాగించడంపై సీబీఐని ప్రశ్నించింది. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారి మార్పుపై ప్రతిపాదనలను సీబీఐ సుప్రీం ధర్మాసనానికి అందజేసింది. అందులో ప్రస్తుత అధికారి రాంసింగ్ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎంఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రాంసింగ్ను కొనసాగించడంపై అభ్యంతరం తెలిపిన జస్టిస్ ఎంఆర్ షా.. కేసు దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్ను కొనసాగించడంలో అర్ధం లేదని పేర్కొంది. అంతేకాకుండా సీబీఐ డీఐజీ చౌరాసియా నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది. అలాగే ఏప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని సీబీఐకి స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేసు దర్యాప్తును ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. మరోవైపు వివేకా కేసులో విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన భార్య తులశమ్మ కోర్టును కోరారు. కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు అయినా పడుతుందని, ఈలోగా ఏ 5 శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తులశమ్మ తరపు న్యాయవాది సుప్రీంను అభ్యర్ధించారు. దీనికి ఆరు నెలల్లో కోర్టు ట్రయల్ ప్రారంభించాలన్న ధర్మాసనం.. లేనిపక్షంలో నిందితులు బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవచ్చని తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE