బాలీవుడ్ లెజెండరీ నటుడు రిషీకపూర్ కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. గతకొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం నాడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషీకపూర్ను ఆయన కుటుంబ సభ్యులు ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం రిషీకపూర్ తుదిశ్వాస విడిచినట్టుగా ప్రకటించారు. రిషీకపూర్ మరణించినట్టు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. బుధవారం రోజే విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించడం, ఈ రోజు రిషీకపూర్ మరణంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ రెండో కుమారుడైన రిషీకపూర్ ముందుగా మేరా నామ్ జోకర్ చిత్రంతో బాల నటుడుగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ‘బాబీ’ చిత్రంతో బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి యువతి యువకులకు ఎంతగానో ఆకట్టుకున్నారు. తొలి చిత్రంతోనే ఆయన ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. బాబీ, లైలా మజ్ను, చాందిని, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్, నగీనా, దీవానా చిత్రాలు ఆయనకు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం కల్పించాయి. అలాగే ఆర్.కే ఫిలిమ్స్ బ్యానర్స్ పై పలు చిత్రాలను నిర్మించారు. హీరోగా, దర్శక, నిర్మాతగా రాణించి పలు అవార్డులను కైవసం చేసుకున్నారు. 2018 లో క్యాన్సర్ బారిన పడడంతో న్యూయార్క్ లో చికిత్స తీసుకుని గత సెప్టెంబర్ లోనే ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. రిషీ కపూర్కు భార్య నీతూ కపూర్, కుమారుడు రణబీర్ కపూర్ ఉన్నారు. రిషీ కపూర్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.