ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియను చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 కోసం ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది గడువు ఫిబ్రవరి 4 తో ముగిసింది. దీంతో ఈ వేలం కోసం 1097 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 814 మంది భారతీయ ఆటగాళ్లు కాగా, 283 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ఈ 1097 మంది ఆటగాళ్ళలో 207 మంది తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళు కాగా (క్యాప్డ్ ప్లేయర్లు), 863 మంది ఇప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు (అన్క్యాప్డ్ ప్లేయర్లు) మరియు 27 మంది అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు. వేలానికి అందుబాటులో ఉన్న భారత్ ఆటగాళ్లలో 21 మంది జాతీయ జట్టుకు ఆడగా, 743 మంది ఇంతవరకు భారత్ జట్టు తరఫున ఆడలేదు. మిగిలిన 50 మంది ఇప్పటికే ఒక ఐపీఎల్ మ్యాచ్ అయినా ఆడి ఉన్నారు. ఫిబ్రవరి 18న చెన్నైలో మధ్యాహ్నం 3 గంటలకు ఐపీఎల్ 2021 మినీ వేలం ప్రారంభం కానుంది. ఈ వేలం ద్వారా 8 ప్రాంఛైజీలు కలిపి 61 మంది ఆటగాళ్లను తీసుకోనున్నారు. వీరిలో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్ళు ఉండే అవకాశం ఉంది. వేలం బరిలో ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మాలాన్, చటేశ్వర్ పుజారా, దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్, శ్రీశాంత్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ