ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం, రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేసేందుకు మొబైల్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు 9,260 మొబైల్ వాహనాలను వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీతో సమకూర్చింది. ఈ నేపథ్యంలో రేషన్ వాహనదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో శుభవార్త అందించారు. ముందుగా ఈ వాహనాల ద్వారా సేవలు అందిస్తున్నందుకుగాను ఒక్కొక్క వాహనదారుడికీ అద్దె కింద 10 వేల రూపాయలు, హెల్పేర్ కోసం 3 వేల రూపాయలు, పెట్రోల్ నిమిత్తం 3 వేలు కలిపి మొత్తం నెలకు రూ.16 వేలు చెల్లిస్తున్నారు. అయితే రేషన్ పంపిణీ ప్రారంభమయ్యాక వారు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి రావడంతో ప్రతినెలా రూ.16 వేలకు బదులుగా రూ.21 వేలు చెల్లించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై నెలకు అద్దె కింద 13 వేల రూపాయలు, హెల్పేర్ కోసం 5 వేల రూపాయలు, పెట్రోల్ నిమిత్తం 3 వేలు కలిపి మొత్తం రూ.21 వేలు చెల్లించనున్నారు.
కాగా వాహనదారులు ఈ మైబైల్ వాహనాన్ని శుభ్రంగా ఉంచుతున్నారా లేదా అనే విషయాన్ని తహసీల్దార్లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించనున్నారు. ఒకవేళ వారిచ్చే నివేదికలో వాహనం శుభ్రంగా ఉండడం లేదని తేలితే అదనంగా చెల్లిస్తున్న డబ్బులో కోత విధించేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ముందుగా ఒక్కో వాహనం విలువ రూ.5,81,000 కాగా 60 శాతం సబ్సిడీతో రూ.3,48,600 కే ప్రభుత్వం అందించింది. బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.1,74,357 మంజూరు చేయగా, లబ్ధిదారుని వాటా కేవలం రూ.58 వేలగా ఉంది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతి నెలా అద్దె చెల్లిస్తూ ఆరేళ్ల పాటు వినియోగించుకోనుంది. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 700, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,300, బీసీ కార్పొరేషన్ ద్వారా 3,800, మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా 660, ఈబీ కార్పొరేషన్ ద్వారా 1,800 వాహనాలను లబ్దిదారులకు అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ