అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా దేశవ్యాప్తంగా పలు జైళ్లలో ఉన్న చాలా మంది ఖైదీలు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటివరకు కరోనా లక్షణాలున్న 2700 మంది పరీక్షలు నిర్వహించడంతో వారిలో సుమారు 2000 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ వెల్లడించింది. అమెరికాలోని జైళ్లలో దాదాపుగా 1,50,000 మంది ఖైదీలు ఉండగా, వీరికి కరోనా సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అక్కడి చట్ట సభ సభ్యులు, న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఖైదీల సమాచారాన్ని తెలియజేయడం లేదని ఖైదీల కుటుంబ సభ్యులు విమర్శిస్తున్నారు.
మరోవైపు ఈ అంశంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ స్పందిస్తూ, కరోనా సంక్రమణ మరియు మరణాల రేటు బయటితో పోలిస్తే జైళ్ళ లోపలే తక్కువగా ఉందని వెల్లడించారు. ఇక జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తాజా సమాచారం ప్రకారం గత 24 గంటల్లో అమెరికాలో కరోనా వైరస్ వలన 2502 మంది మరణించారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలు దాటగా, ఇప్పటివరకు 61,361 కరోనా మరణాలు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu