కరోనా తర్వాత ఉద్యోగ అవకాశాలు పెద్దగా కనిపించకపోవడంతో..అమాయకులను నిండా ముంచడమే పనిగా పెట్టుకున్నారు కొంతమంది కేటుగాళ్లు. కాస్త టెక్నాలజీలో గ్రిప్ పెంచుకుంటే చాలు అవతలివాళ్లను ఈజీగా బురిడీ కొట్టించొచ్చని కాన్సెప్ట్తో చెలరేగిపోతున్నారు. ఆన్ లైన్లో అడ్డగోలుగా మోసాలు చేస్తూ నిలువునా ముంచేస్తున్నారు. మీకు లాటరీ తగిలింది, మీ పాన్ నంబర్ అప్ డేట్ కాలేదు వంటి మెసేజ్లతో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్లి కరెంటు బిల్లుల పేరుతో వినియోగదారుల ఖాతాలోని డబ్బులు కాజేస్తున్నారు. దీంతో విద్యుత్ శాఖ నుంచి అధికారికంగా వచ్చిన సందేశాలుగా చాలా మంది పొరబడి మోసపోతున్నారు.
గత నెల పవర్ బిల్లు ఇంకా అప్డేట్ కాలేదని, అందుకే ఈ రాత్రికి కనెక్షన్ను డిస్కనెక్ట్ చేస్తున్నామన్న మెసేజ్లు ఈ మధ్య చాలామందికి వస్తున్నాయి. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు పవర్ స్టేషన్ నుంచి మీ పవర్ డిస్కనెక్ట్ చేయబడుతుందని.. ఎందుకంటే మీ గత నెల బిల్లు అప్డేట్ కాలేదని.. దయచేసి వెంటనే విద్యుత్ అధికారి 92609XXX52ను సంప్రదించండి. ధన్యవాదాలు’. అంటూ మెసేజ్లు పంపిస్తూ బడా మోసానికి తెర తీస్తున్నారు. అయితే కంగారుపడి పొరపాటున కూడా ఈ నెంబర్కు కాల్ చేయొద్దని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఆన్లైన్ స్కామ్లో అఫీషియల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పంపినట్లుగా మెసేజులను మోసగాళ్లు పంపుతున్నారు. బిల్లు కట్టకపోతే వెంటనే కరెంటు కట్ చేస్తామని బెదిరించడంతో..ఆందోళనకు గురయి వెంటనే చెల్లిస్తున్నారు.
స్కామర్లు వినియోగదారులను మోసం చేయడానికి అధికారిక లోగోలు, లోకల్ లాంగ్వేజ్ను కూడా ఉపయోగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే వారు కరెంట్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడంతో పాటు, ఆ నెంబర్ను స్కామర్లు తెలుసుకుంటున్నారు. దీనికి తోడు ఏది నకిలీ మెసేజ్ ఏది అసలు మెసేజ్ అన్నది కనిపెట్టడం కష్టంగా ఉండటం వల్ల వీరి మోసాలకు చాలామంది బాధితులుగా మారిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది కరెంట్ బిల్లుల స్కాముతో ముంచేసిన స్కామర్లు.. కొత్తవాళ్లను కూడా వదలడం లేదు. మెసేజ్ పంపాక వాళ్లే కాల్ చేయడమో లేకపోతే.. మెసేజులో ఉన్న నంబరుకు బాధితులు కాల్ చేయడమో జరుగుతుంది. దీంతో ఒక లింక్ ను పంపి .. దానిలో నుంచి పేమెంట్ చేస్తే కరెంట్ కట్ అవకుండా ఉంటుందని నమ్మిస్తున్నారు. దీంతో వాళ్లను నమ్మి లింక్ ను ఓపెన్ చేసి తమకు తెలీకుండానే అకౌంట్లు ఖాళీ చేసుకుంటున్నారు బాధితులు. అంతేకాదు కొన్ని చోట్ల వ్యూయర్ క్విక్ సపోర్టు మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ను పంపి..వాళ్లు ఆ యాప్ను డౌన్లోడ్ చేసిన వెంటనే, స్కామర్లు వాళ్ల బ్యాంకు ఖాతాకు యాక్సెస్ను పొంది ఖాతాను ఖాళీ చేసేస్తున్నారు.
విద్యుత్ బిల్లుల పేరుతో మోసపోకుండా ఉండాలంటే..
ఇలాంటి మెసేజ్లు రాగానే కంగారు పడకుండా వెంటనే దానిని ఇంట్లో వాళ్లతో షేర్ చేసుకోవాలి. కరెంటు బిల్లు బకాయి ఉందని క్లెయిమ్ చేస్తూ.. మెసేజ్ లేదా ఈ-మెయిల్ కానీ ఫోన్ కానీ వస్తే, స్పందించ కూడదు. అలాగే ఏదైనా లింక్లపై క్లిక్ చేయకూడదు. ఒకవేళ నిజంగానే పవర్ కట్ చేస్తారన్న అనుమానం ఉంటే.. మీ బిల్లులోని ఫోన్ నంబర్ లేదా వెబ్సైట్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంట్ను సంప్రదించి అనుమానం తీర్చుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఇలాంటి మెసేజుల ద్వారా వచ్చిన లింక్లు లేదా ఫోన్ నంబర్ల ద్వారా చెల్లింపు చేయకూడదు. ఎవరికీ బ్యాంక్ ఖాతా నంబర్ , ఓటీపీ వంటివి చెప్పకూడదు. వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ పంచుకోవద్దు. పేరు, చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, ఓటీపీ ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. ఒకవేళ స్కామర్ల బారిన పడినట్లు అనిపిస్తే.. వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ