పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాక మార్చి 16న భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, నెల రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా పంజాబ్ ప్రజలకు శుభవార్త అందించారు. జూలై 1వ తేదీ నుండి రాష్ట్రంలో ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ ప్రకటన విడుదల చేసింది.
ముందుగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా, తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. ఇటీవలే సీఎం భగవంత్ మాన్ ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమై ఈ అంశంపై కీలకంగా చర్చించారు. అనంతరం అతి త్వరలోనే పంజాబ్ ప్రజలకు శుభవార్త అందిస్తానని ప్రకటించారు. ఈ మేరకే జూలై 1 నుంచి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుపై పంజాబ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. మరోవైపు ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలో కూడా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ