విప్రో సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ అబిదాలీ నీముచ్వాలా తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబపరమైన కారణాలతో విప్రో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు, జనవరి 31, శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో ఆయన తెలిపారు. అలాగే కొత్త సీఈవో నియామకం జరిగే వరకు అబిదాలీ ఈ పదవిలో కొనసాగనున్నారు. దాదాపు 75 ఏళ్ల చరిత్ర ఉన్న విప్రో సంస్థలో పని చేయడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాలుగా తనకు మద్దతుగా నిలిచిన అజీమ్ ప్రేమ్జీ, రిషబ్ ప్రేమ్జీ, ఇతర బోర్డు డైరెక్టర్లు, సంస్థ ఉద్యోగులు, వినియోగదారులకు అబిదాలీ కృతజ్ఞతలు తెలిపారు. విజయాలు సాధించేందుకు, డిజిటల్ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు అబిదాలీ చేసిన కృషిని అజీమ్ ప్రేమ్జీ కొనియాడారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్టు విప్రో యాజమాన్యం ప్రకటించింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు ఇచ్చిన ఫైలింగ్ లో కూడా విప్రో సంస్థ ఈ విషయాన్ని తెలియజేసింది. కొత్త సీఈవో ఎంపిక కోసం కంపెనీ బోర్డు సభ్యులు చర్చించనున్నారు.
మరోవైపు అమెరికాకు చెందిన దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎమ్ సీఈవోగా భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణ నియమితులయ్యారు. అరవింద్ కృష్ణ నియామకంపై ఐబీఎం సంస్థ జనవరి 30, శుక్రవారం నాడు ప్రకటన విడుదల చేసింది. బోర్డ్ ఆఫ్ డైరక్టర్లు అరవింద్ కృష్ణను సీఈవోగా ఎన్నుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఏప్రిల్ 6, 2020 నుంచి ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ బాధ్యతలు తీసుకోనున్నారు.
[subscribe]